Thursday, September 17, 2026
HomeUncategorizedటి20 ఫైనల్ కి చేరిన భారత్

టి20 ఫైనల్ కి చేరిన భారత్

*మలుపు తిప్పిన బుమ్రా.. ఉత్కంఠపోరులో భారత్ విజయం!*

 

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లెంది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది.

 

గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది.

 

జాకోబ్ బెతెల్ విధ్వంసకర శతకంతో టీమిండియాను వణికించాడు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో సత్తా చాటితే.. అక్షర్ పటేల్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 

*వణికించిన జాకోబ్ బెతెల్*

 

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. . సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుపులు మెరిపించారు. చివర్లో తిలక్ వర్మ(7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27)దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్(2/40), ఆదిల్ రషీద్(2/41) రెండేసి వికెట్లు తీయగా… జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 19 సిక్సర్లు, 20 ఫోర్లు బాదారు.

 

అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. జాకోబ్ బెతెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 ) శతకంతో ఒంటరి పోరాటం చేయగా.. విల్ జాక్స్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/38) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా(1/33), వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

 

*గెలిపించిన బుమ్రా..*

 

చివరి 18 బంతుల్లో ఇంగ్లండ్ విజయానికి 45 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్ వేసిన జస్‌ప్రీత్ బుమ్రా 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో చివరి 12 బంతుల్లో ఇంగ్లండ్ విజయానికి 39 పరుగులు అవసరమయ్యాయి. హార్దిక్ పాండ్యా 19వ ఓవర్‌లో తొలి బంతినే సిక్సర్ బాదిన జాకోబ్ బెతెల్ 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌ మూడో బంతికి సామ్ కరణ్‌ను ఔట్ చేసిన హార్దిక్ పాండ్యా.. తర్వాతి మూడు బంతులను కట్టడిగా వేసి ఈ ఓవర్‌లో మొత్తం 9 పరుగులే ఇచ్చాడు.

 

ఆఖరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. శివమ్ దూబే వేసిన ఈ ఓవర్‌ తొలి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో డేంజరస్ బెతెల్ రనౌటయ్యాడు. తర్వాతి రెండు బంతులను డాట్ చేసిన శివమ్ దూబే.. భారత్ విజయాన్ని లాంఛనం చేశాడు. చివరి మూడు బంతుల్లో మూడు సిక్స్‌లు, వైడ్ ఇచ్చినా.. టీమిండియాకు నష్టం జరగలేదు. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments